మన్యం న్యూస్, మణుగూరు: పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాలలోని టీ ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులుతో కలిసి పర్యటించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం అన్నారు. అన్ని మండలాలలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీకి అనుబంధంగా ఉండే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారి నివాసాలకు వెళ్లి పరామర్శించాలని ఆదేశించారు. వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని భరోసా కల్పించాలన్నారు. గ్రామాలలో నాయకులు పర్యటనలకు వెళ్ళినప్పుడు వివిధ రకాల కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేపించుకొని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారి మెడికల్ బిల్లులు తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగిందని, నియోజకవర్గంలో వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఏటా సీఎం సహాయ నిధి ద్వారా చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకొని సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.
Post A Comment: