మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల కారణంగా "తెల్ల బంగారంగా" పేరొందిన పత్తి పంట దెబ్బతిని దిగుబడులు పూర్తిగా తగ్గాయి. పత్తి ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది జూలూరుపాడు మండల వ్యాప్తంగా సుమారు 17 వేల ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. పంట మొదటి నుండి ఏపుగా పెరిగి రైతులకు ఎన్నో ఆశలను కలిగించింది. మరోపక్క గిట్టుబాటు ధర పలకడంతో కలలు కన్న రైతును కారు మేఘం కమ్మేసి కల చెదరగొట్టింది. అధిక వర్షాలతో పూతా, పిందే, రాలీ చెట్లు ఎర్రబారి పంట పూర్తిగా దెబ్బతింది. ఆరుగాలం చాకరిచేసి, అప్పులు తెచ్చి, పెట్టుబడులు పెట్టి, పంట దిగుబడి లేక తెల్ల బంగారం పండించిన రైతులు నష్టాల ఊబిలో చిక్కుకొన్నారు. ఎకరాకు సుమారుగా 15 నుండి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం ఎకరాకు 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం కు చెందిన ఎస్ లక్ష్మి, (మహిళా రైతు) మరియు మాలోత్ రాములు అనే పత్తి రైతులు పంట సాగు కైన ఖర్చు, అధిక వర్షాలతో నష్టపోయిన పంట, తగ్గిన దిగుబడి, పత్తితీతలకు అవుతున్న ఖర్చు, తెలియజేస్తూ ఆవేదన చెందారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
Navigation
Post A Comment: