ఉరుకుల పరుగుల జీవితాన్ని నెగ్గుకు రావాలి
- ముగ్గులు సంప్రదాయ రంగవల్లులు
- నేటితో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 19.. జీవితం ఉరుకుల పరుగుల మయమని, దానిని నెగ్గుకు వచ్చేందుకు ప్రతీ ఒక్కరు అలుపెరగని పరుగులు తీయాలని జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సముద్రాల శ్రీనివాస్ అన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారమైన ఆరో రోజు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠకులకు పరుగు పందెం, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ జీవితమే ఓ పరుగు పందెం లాంటిదని, సరదాగా అలుపెరగని పరుగుతో ఆనందంతో ముందుకు సాగి పోవాలని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలను ప్రభుత్వం సమకూరుస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించి చక్కటి జీవితాన్ని కొనసాగించాలని మీరు ప్రయోజకులైన తర్వాత మరికొందరికి మీ వంతు చేయూతనందించి ముందుకు సాగేలా తోడ్పాటు అందించాలని కోరారు. తెలుగు సాంప్రదాయపు హరివిల్లులు ఈ ముగ్గులనీ, తెలుగుతనాన్ని సంస్కృతిని చాటి చెప్పే రంగవల్లుల్ల మాదిరిగా అందరి జీవితాలు సుందరమయంగా ఉండాలని ఆకాంక్షించారు. ముగ్గులు వేయడం అంత సులువైన పని కాదని, గజిబిజి చుక్కలను కలుపుతూ అందంగా తీర్చిదిద్దే మహిళా చేతులు తికమక స్థితిలో మగ్గిపోయే కుటుంబాలను చక్కబెట్టి మంచిగా మలుస్తాయని చెప్పుకొచ్చారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు డి వరలక్ష్మి జి. మణి మృదుల, యం. నవీన్ కుమార్. కే. మధు బాబు, సిబ్బంది, పాఠకులు తదితరుల పాల్గొన్నారు.
వారోత్సవాల ముగింపు
జిల్లా గ్రంధాలయ వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ముగింపు వేడుక స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఆదివారం ఉ.10 గంటలకు ప్రారంభం అవుతుంది. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయమన్నారు. ముగింపు వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చైర్మన్ దిండిగాల కోరారు.
Post A Comment: