మన్యం న్యూస్ : జూలూరుపాడు, అక్టోబర్ 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని గాంధీనగర్, గంగారం తండా, రామకృష్ణాపురం, తదితర గ్రామాల్లో అధిక వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్రా నరేంద్ర కుమార్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాద్రి జిల్లాలో పత్తి పంట పూర్తిగా దెబ్బ తిన్నదని, వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంట కనీసం ఎకరాకు రెండు మూడు క్వింటాళ్ళ దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని, అన్నారు. అధిక వర్షాలు వల్ల పూత, పిందె రాలిపోవడం, మొదటి కాపు కాయలు నల్లబడి పూర్తిగా దెబ్బతిని పోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు ఏ విధంగా తీరుతాయని దిగులు చెందుతున్నారని అన్నారు. జూలూరుపాడు మండల వ్యాప్తంగా 17వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నా రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే జరిగిన నష్టాన్ని అంచనా వేయించి వారికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య జరిగిన దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, భూక్యా శంకర్, బానోత్ హర్య, మలోత్ గోపాల్, భూక్య ధర్మ, హనుమ, మంగ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: