జూలూరుపాడు, అక్టోబర్ 29, (మన్యం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో ఆదివాసి గిరిజనుల అసైన్మెంట్ భూములలో మట్టి తోలకాలకు సమాయత్తమైన వాహనాలను స్థానిక ఆదివాసీ గిరిజనులు అడ్డుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసి గిరిజన సంఘ నాయకులు, పేసా గ్రామ కమిటీ కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన దబ్బకట్ల నరసింహారావు అనే గిరిజన రైతు పేరు మీద అక్రమంగా పర్మిషన్ తీసుకొని, పరిసర ప్రాంత గిరిజన రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా పంట పొలాల మధ్య నుండి దారి చేస్తుండగా జెసిబి ని అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. బాధిత ఆదివాసి గిరిజన రైతుల సమక్షంలో పెసా గ్రామసభ నిర్వహించాల్సి ఉండగా, వీరు నిరాకరించడంతో సంబంధంలేని దండుమెట్ట తండా హ్యాబిటేషన్ లో పెసా గ్రామసభ నిర్వహించి అక్రమంగా పర్మిషన్ తెచ్చుకోవడం వెనక మతలబ్ ఏంటో తేల్చాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, అక్రమాల పై ప్రజల తరఫున నిలబడాల్సిన గ్రామ ప్రజా ప్రతినిధులు ఈ విషయంపై పెదవి విప్పకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పర్మిషన్ రద్దు చేసి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తెల్లం నరసింహారావు దొర, పెసా గ్రామ కమిటీ కార్యదర్శి కట్రం ప్రసాద్, పోతిని చిట్టెమ్మ, కిన్నెర సావిత్రి, బోడ బిచ్చా, కిన్నెర కిట్టు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: