సారపాక, అక్టోబర్ 21, మన్యం న్యూస్:
ఆర్ధిక ఇబ్బందులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సారపాకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సారపాక భాస్కరనగర్ కి చెందిన గుంజా శివమ్మ ( 35 ) భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింటి వద్ద ఉంటోంది. కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. గురువారం కుటుంబసభ్యులు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న శివమ్మ సాయంత్రం సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృతికి గల వివరాలు సేకరించారు. శివమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు ఎస్సై రమణారెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: