మన్యం న్యూస్, చండ్రుగొండ ,అక్టోబర్ 22: మండల పరిధిలోని, రామవరం రేంజ్ పరిధిలోగల సీతయిగూడెం గ్రామంలో ఆదివాసి పోడుదారులు పోడు సర్వే చేయమని డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్న కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి పోడుదారులు మాట్లాడుతూ... 2004 నుంచి 2020 వరకు 80 ఆదివాసి కుటుంబాలు పోడు సాగు చేస్తూ జీవనం గడుపుతున్నారు. 2020లో రామవరం ఫారెస్ట్ రేంజర్ వచ్చి ప్రభుత్వ ఆదేశాలు మేరకు మీ భూములను ప్లాంటేషన్ చేస్తున్నామని, మరలా పోడు భూములను సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించినచో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్లాంటేషన్ పోడు భూములను సర్వే చేయమని గ్రామసభ పీసా కమిటీలో తీర్మానం, అటవీ హక్కుల కమిటీలు కూడా తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మాత్రం ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ లో సర్వే చేయడం కుదరదని అని అంటున్నారు.16 సంవత్సరాలుగా ఆ పోడుభూముల మీద జీవనం సాగించామని, ప్లాంటేషన్ చేసిన పోడుభూములను సర్వే చేయకపోతే మేము ఎలా బ్రతకాలని, ఆదివాసి పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల కమిటీ సభ్యుడు రాజిని వెంకటేశ్వర్లు , ఆదివాసి పోడుదారులు కీసరి వెంకటేశ్వర్లు, పిట్టల పాపయ్య,కుంజ రామారావు,కీసరి వెంకటమ్మ, కీసరి వసంత, కాక కుమారి,కాక పుల్లమ్మ,కురమ వెంకటమ్మ, పిట్టల స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: