మన్యం న్యూస్ బూర్గంపాడు అక్టోబర్ 31: ప్రాణాలు గాల్లో కలుస్తున్నా జాతీయ రహదారుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ శాఖ నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామం నుంచి మణుగూరు క్రాస్ రోడ్డు మీదుగా భద్రాచలం, చత్తీస్ రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద పెద్ద గోతులు పడి అధ్వాన్నంగా తయారైంది. హైవే అధికారులకు స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందించటంలేదు. ఇప్పటికే ఈరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా,కొంతమంది తీవ్ర గాయాలు పాలైన సంఘటనలున్నాయి. సోమవారం హైవేపై ఏర్పడిన గోతులలో బొలేరో వాహనం బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి.ఇటీవల ఇదే రహదారిపై ముసలిమడుగు గ్రామ సమీపంలో రహదారిపై ఉన్న గోతిలో ఓ వాహనం బోల్తా పడి కృష్ణా జిల్లాకు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సమస్యను చెప్పుకునేందుకు హైవే అధికారులకు ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా కూడా కనీసం అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఇకనైనా అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేయించాలని,అలాగే హైవే కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Navigation
Post A Comment: