జూలూరుపాడు అక్టోబర్ 15, (మన్యం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అతివృష్టి, అనావృష్టి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వ్యవసాయాన్ని నమ్ముకుని, వ్యవసాయంపైనే ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకునే రైతన్నలకు ఈ ఏడాది వరుస భారీ వర్షాల కారణంగా పత్తి సాగు రైతులకు భారీ నష్టాలనే మిగిల్చే పరిస్థితి నెలకొంది. అప్పో సప్పో చేసి వేల రూపాయలు పంటకు పెట్టుబడి పెట్టి, తినీ తినక, ఎండనక వాననక, ఆరుగాలం చాకిరి చేసి, తీరా పంట చేతికొచ్చి ఒక రూపాయి మిగులుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న పత్తి సాగు రైతును కురుస్తున్న భారీ వర్షాలు దిక్కు తోచని స్థితిలో పడేసాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి అధిక వర్షపాతం నమోదు కావడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వలన పూత పిందే రాలిపోవడం, మొదటి కాపు కాయలన్నీ నల్లబడి పూర్తిగా దెబ్బతిని పోవడం వలన రైతన్నలు అయోమయంలో పడ్డారు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి చేసిన అప్పులు ఎలా తీరతాయని ఆవేదన చెందుతున్నారు. మన ప్రాంతంలో తెల్ల బంగారం గా పిలవబడి పత్తి, ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది జూలూరుపాడు మండల వ్యాప్తంగా సుమారు 17 వేల ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా సుమారు 69 వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్న రైతన్నల పాలిట ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలు శాపంగా మారాయి. ఒకపక్క కోతుల బెడద, మరో పక్క గిట్టుబాటు ధర లేక, ఇంకో పక్క దళారుల చేతిలో మోసపోతున్న రైతులను ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలు పత్తి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి.
Navigation
Post A Comment: