మన్యం మనుగడ, ములుగు :
వృద్ధత్వం శాపం కాకూడదని జీవితంలో వివిధ రంగాల్లో రాణించిన వారు వృద్ధాప్యాన్ని ముందస్తు ప్రణాళికలతో జయించారని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళలు,పిల్లలు,వయో వృద్ధులు,దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్,డిఆర్ఓ రమాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ మాట్లాడుతూ అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో యువత ఎక్కువగా ఉందని,ఆ యువత వయో వృద్ధులుగా ఉండే దేశం కూడా మన దేశమే అవుతుందని,అందుకు ముందస్తు ప్రణాళికలతో సమాజంలో ముందుకు వెళ్లాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.వృద్ధులకు ఆర్థిక స్థిరత్వం ముఖ్యమైందని,కష్టపడే వయసులో ఉన్నప్పుడు పొదుపుతో ఆర్థికసమస్యలను అధిగమించాలని,పొదుపు చేసుకోవడం వల్ల వారి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థిక పొదుపు ఉపయోగపడుతుందని అన్నారు.
వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా అధికారులు తోడ్పాటు అందిస్తారని త్వరలో ములుగు జిల్లాలో వయోవృద్ధుల హోం నెలకొల్పడం జరుగుతుందని వారికి ఎలాంటి సమస్యలున్న తీర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా డిఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ వృద్ధులు అంటే చదివిన పుస్తకం అని వయోవృద్ధుల సంక్షేమ సంఘం ప్రభుత్వ అధికారి యంత్రాంగం మధ్య వారి సమస్యలు పరిష్కరించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి వారికి సహకరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.వయోవృద్ధుల సంక్షేమం కోసం 2007లో చట్టం వచ్చిందని 2011నుండి అమలు జరుగుతుందని ఈ చట్టం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల కొడుకులు కూతుర్లు బాధ్యతగా వ్యవహరించాలని వారి పోషణ కోసం సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కస్తూరి భాయి వృద్ధాప్య ఆశ్రమం నిర్వహిస్తున్న కొమరిగిరి సామ్రాజ్యం,కేశవరావు దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సారయ్య, బాసాని రామ్మూర్తి,శ్యామల నాయక్, చింతం రాయమల్లు,మునిమ్ ఖాన్, కందకట్ల సారయ్య,నంద,సమ్ములు నాయక్,వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: