మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం ఏడూల్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని జి.వి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ భూనిర్వాసిత ఉద్యోగుల విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదివారం నాడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో 346 మంది కి భద్రాద్రి, ధర్మల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పక్షాన ఆలోచించి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుందని యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. 400 మంది ఉద్యోగస్తులకు కాలనీల నిర్మాణం కూడా చేపడుతున్నామని, రెండు మూడు రోజులలో టెండర్లను పిలుస్తామని అన్నారు. ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగస్తులు , తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: