జూలూరుపాడు ఆగస్టు 9, (మన్యం మనుగడ ప్రతినిధి) ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలను కొమరం భీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మండల కేంద్రంలోని పాపకొల్లు సెంటర్ నందు ఏర్పాటుచేసిన ప్రపంచ ఆదివాసి జెండాను ఎగురవేశారు. అనంతరం అదే సెంటర్లో నూతనంగా ఏర్పాటుచేసిన కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసి హక్కుల పరిరక్షణ, సాధన కోసం పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. పోడు భూములు ఆదివాసీలకు జీవనాధారమని, అటువంటి భూములపై ఆదివాసీలకు సర్వహక్కులు ఉన్నాయని అన్నారు. పోడు భూముల పరిరక్షణ కోసం ఆదివాసీలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోడు భూములకు హక్కులు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలకు ఇది జీవన్మరణ సమస్యగా మారిందని అవసరమైతే ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం ను సాయిబాబా ఆలయం నుండి ఆదివాసి సాంప్రదాయ కొమ్ము నృత్యంతో స్వాగతం పలికి మండల కేంద్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా ఆదివాసి మహిళలు, యువత విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం ఫౌండేషన్ సభ్యులు, ఆదివాసి సంఘలా నాయకులు, ఆదివాసి ప్రజా ప్రతినిధులు, ఆదివాసి ఉద్యోగులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: