జూలూరుపాడు ఆగస్టు 13, (మన్యం మనుగడ ప్రతినిధి) మండల వ్యాప్తంగా అన్ని పల్లెల్లో ప్రతి ఇంట మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామపంచాయతీ పాలకమండలి ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే మండల కేంద్రంలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ప్రజా భాగస్వామ్యంతో 2కె రన్ ఫ్రీడం ర్యాలీ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఇంతే కాక గ్రామాల్లో పంచాయితీ పాలకమండలితోపాటు, పలు రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తుండడం గమనార్హం. గ్రామాలలో యువకులు ఉత్సాహంగా తమ ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు జాతీయ జెండాను కట్టుకొని తమ దేశభక్తిని చాటుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు గ్రామాలలో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పోలీస్ శాఖ, రెవిన్యూ శాఖ, మండల అభివృద్ధి శాఖ, అటవీ శాఖ, విద్యాశాఖ, పలు మండల శాఖల అధికారులు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నారు.
Post A Comment: