జూలూరుపాడు ఆగస్టు 8, (మన్యం మనుగడ ప్రతినిధి) మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ప్రధాన పూజారి రామచంద్రమూర్తి చెప్పిన వివరాల ప్రకారం రోజువారి పూజా కార్యక్రమాలలో భాగంగా గుడి వద్దకు రావడంతో గుడి ప్రధాన ద్వారం తెరిచి ఉండడం గుర్తించి, గుడి లోపలికి వెళ్లి పరిశీలించగా దక్షిణం వైపు ఉన్న ద్వారం పగలగొట్టి, గుడి లోపల ఉన్న హుండీలు పగలగొట్టి ఉన్నాయని తెలిపారు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను చూడగా వాటి వైర్లు కత్తిరించి ఉన్నాయని అవి కూడా కనిపించడం లేదని అన్నారు. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు, ఆలయ నిర్వహణ కమిటీకి తెలియజేశామన్నారు. ఆలయ హుండీలలో నెలకు సుమారుగా 15వేల రూపాయలు కానుకలు వస్తాయని, గత మూడు నెలలుగా హుండీలను తెరవలేదని తెలిపారు. స్థానిక ఎస్సై పోటు గణేష్ క్లూస్ టీం ను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి విచారణ చేపట్టారు.
Post A Comment: