మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని వసతిగృహం భవనంపై నుండి దూకి కాలు విరగొట్టుకున్న సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని తుంగారం గ్రామానికి చెందిన పప్పుల ప్రమీల స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల వసతిగృహంలో ఆరోతరగతి చదువుతుంది. ఇటీవల తల్లిదండ్రులు వసతిగృహానికి వచ్చినప్పుడు ప్రమీల తాను హాస్టల్లో ఉండనని, ఇంటికి తీసుకెళ్ళమని బ్రతిమిలాడింది. కాని తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో వసతిగృహంలో ఉండిపోయింది.మంగళవారం ఉదయం తోటివిద్యార్థులతో కేజీబీవీ భవనం ఎక్కి అక్కడ బట్టలు ఆరవేసుకుంటూ ఒక్కసారిగా పై నుండి క్రిందకు దూకింది. దీంతో తోటివిద్యార్థులు గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించడం వెంటనే దూకిన విద్యార్థిని హుటాహుటిన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కాలు విరిగింది. భవనంపై నుండి దూకిన స్థలంలో నీరు, బురద ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తోటి విద్యార్థులు,ఉపాధ్యాయులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి వసతిగృహంలో లేకపోవడం గమనార్హం.కేజీబీవీ ప్రత్యేకాధికారి స్థానికంగా ఉండేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.ప్రస్తుతం విద్యార్థినికి కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
Post A Comment: