మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని జానంపేట ఇసుక ర్యాంపులు నిర్వాహకుల లోపంతో వివాదాల మయంగా మారుతున్నాయి. ఏడూళ్ళ బయ్యారం పంచాయతీలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఇసుక ర్యాంపు కారణంగా గతంలో కూడా ఇబ్బందులు పడ్డారు. సోమవారం నాడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉదయాన్నే పాఠశాలకు వచ్చి జెండా వందన అనంతరం ఇంటికి తిరుగు పయనమైన విద్యార్థులకు ఇసుక ర్యాంపు రూపంలో అడ్డంకి వచ్చింది. ఒక్కసారిగా లోడ్ తో నిండిన లారీల రాకతో, వెళ్లడానికి దారి లేక, వేరే గత్యంతరం లేక గంటకు పైగా పాఠశాల బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సమయాభావం పాటించకపోవడం, కాసుల కోసం కక్కుర్తి పడుతూ, ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తున్న ఇసుక నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇసుక ర్యాంపు నిర్వహణ బాధ్యత మేము చూసుకుంటాం అంటూ, చిన్నా చితకా నాయకులు మేము ఏది చెప్తే అదే అని హడావిడి చేస్తూ, వీరంగం సృష్టిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పిల్లలు ఆకలితో చాలా సమయం వరకు ఎదురుచూసి అలసిపోయారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ విషయం గురించి ప్రభుత్వాధికారులు స్పందించి పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
Post A Comment: