- పోలీసులకు విన్నవించిన లారీ డ్రైవర్లు
- రంగంలోకి దిగిన ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ టీవీ ఆర్ సూరి
- లారీలకు ఇసుక ఎత్తిన జానంపేట క్వారీ నిర్వాహకులు
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట ఇసుక ర్యాంపు మొదటి నుండి వివాదాల సుడిలోనే ఉంది. తాజాగా ఇసుక ర్యాంపు కు లోడింగ్ కోసం వచ్చిన లారీల డ్రైవర్లు రోజుల తరబడి ఎదురుచూసి విసిగి వేసారి పోయారు. కారణం అధిక లోడు వేసుకుంటేనే లోడింగ్ చేస్తామని తేల్చి చెప్పిన టిఎస్ ఎం డీసీ అధికారుల విషయం గురించి ఏడూళ్ల బయ్యారం పోలీసులకు లారీ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఎప్పుడో ఇసుక కోసం లారీలను బుక్ చేసుకున్నామని, అధిక లోడు వేసుకుంటేనే, లారీలకు ఇసుక ఎత్తుతామని, లేకపోతే ఇసుక ఎత్తే సమస్యే లేదని టీఎస్ ఎం డీ సీ అధికారులు తేల్చి చెప్పారని, లారీ డ్రైవర్లు పోలీస్ స్టేషన్ లో తమ గోడును వెల్లబోసుకున్నారు. మమ్మల్ని కాదని అధిక లోడు కోరుకున్న కొందరు లారీ డ్రైవర్లకు సహకరిస్తున్నారని, కొన్ని రోజులుగా రోడ్డుపక్కనే లారీలు నిలుపుకొని ఎదురుచూస్తున్నామని, రాత్రిపూట బస చేయడం చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఏడూళ్ల బయ్యారం ఎస్సై టివిఆర్ సూరి, ఇసుక క్వారీ నిర్వాహకులతో మాట్లాడి, మరలా ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదని, క్వారి నిబంధనల మేరకు నడుచుకొని, క్వారీని నడపాలని హెచ్చరించారు. లేనియెడల తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. సమస్యను విన్న వెంటనే స్పందించిన, ఎస్ఐ టీవీఆర్ సూరికి లారీ డ్రైవర్లు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: