★ తమిళనాడులోని కృష్ణగిరిలో భారీ సభ
మన్యం టీవీ వెబ్ న్యూస్:
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. ఏటా జూలై 5న తమిళనాడు రాష్ట్ర రైతు దినోత్సవం నిర్వహించుకోవడం అక్కడ ఆనవాయితీ. తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో పలు రాష్ర్టాల రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి వసతి కల్పన కార్యక్రమాలను ప్రశంసించారు.కల్యాణలక్ష్మి, గురుకుల విద్య, ఆసరా పెన్షన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలవుతున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ పథకాల వల్ల రైతులకు కలుగుతున్న మేలును వివరించారు.ఇలాంటి పథకాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేస్తే.. రైతుల కష్టాలు తీరుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహంనాయుడు మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి,రైతు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయరంగానికి అధిక నిధులు కేటాయిస్తూ, వ్యవసాయాన్ని పండుగ చేశారని కొనియాడారు. రైతుబంధు ద్వారా రైతులకు రూ. 58 వేల కోట్లు పంపిణీ చేసిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో తమిళనాడు వ్యవసాయ సంఘాల జేఏసీ చైర్మన్ పీకే దైవ శిగామణి, కర్ణాటక రైతు సంఘాల చైర్మన్ కే శాంతకుమార్,తమిళనాడు రైతు సంఘం అధ్యక్షుడు రామగౌండర్,ఉత్తరాంధ్ర కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు గాడి శివకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: