జూలూరుపాడు జులై 10, (మన్యం మనుగడ) ప్రతినిధి, గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్ కోరారు. వర్షాకాలంలో అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్ వాహకాలకు దూరంగా ఉండాలని, రైతులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు పాటించాలని, వర్షం పడుతున్న సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఎత్తైన చెట్ల కింద గాని, టవర్ల కింద గాని తల దాచుకునే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. శిధిల అవస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయటం మంచిదని సూచించారు. ఉధృతిగా ప్రవహిస్తున్న వరదలలో ఎవరు దిగకూడదని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏదైనా అత్యవసర సమయంలో పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 100కు ఫోన్ చేసి పోలీస్ శాఖ సేవలను పొందవచ్చునని తెలిపారు.
Post A Comment: