CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆరోగ్యలక్ష్మి అద్భుతం .బాలామృతం ఆదర్శప్రాయం.

Share it:



★ పెరిగిన నాణ్యత.. తగ్గిన ఫిర్యాదులు


★ పారదర్శక పంపిణీ.. పర్యవేక్షణ భేష్‌


★ స్త్రీ, శిశు సంక్షేమంలో తెలంగాణ టాప్‌


★ నీతిఆయోగ్‌ తాజా నివేదికలో ప్రశంస


మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల కోసం అందజేస్తున్న బాలామృతం ప్లస్‌ కార్యక్రమాన్ని మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అమలు చేస్తున్నారని కొనియాడింది. సమీకృత శిశు అభివృద్ధి కోసం వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం టేక్‌హోం రేషన్‌’ పేరుతో నీతి ఆయోగ్‌ ఇటీవల నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభు త్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు అందజేస్తున్న పౌష్ఠికాహార పంపిణీ విధానం అద్భుతంగా ఉన్నదని ఈ నివేదికలో ప్రశంసించింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాల ఫలితంగా నాసిరకం వస్తువుల సేకరణతో పాటు, ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ, పారదర్శక విధానాల ఫలితంగా పోషకాహార పంపిణీలో ఆర్థిక నష్టాలతో పాటు, అనారోగ్య ముప్పు ను తప్పించడంలో ముందు వరుసలో నిలిచిందని కొనియాడింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలిచాయని ప్రశంసించింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారానికి అదనపు విలువలను జోడించి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని వివరించింది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సహకారంతో రూపొందించిన అదనపు పోషక విలువలు గల ఆహారాన్ని ఎంపికచేసిన చిన్నారులకు బాలామృతం ప్లస్‌గా అందిస్తున్న విధానం అనుసరణీయమని కీర్తించింది.


నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలు:


★ తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా పాలు కొనుగోలు చేసి గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్కరికి రోజుకు 200 మిల్లీ లీటర్ల చొప్పున అందిస్తున్నది. పాలలో ఉండాల్సిన పోషకాల గురించి ముందే నిర్దేశించి, ఆన్‌లైన్‌ టెండరింగ్‌ విధానం ద్వారా కొనుగోలు చేస్తున్నది. ఈ-టెండర్‌ ప్రక్రియలో సహకార సమాఖ్యలు మాత్రమే పాల్గొనాలనే నిబంధన విధించడం వల్ల నేరుగా రైతులు ప్రయోజనం పొందుతున్నారు.


★ తెలంగాణ ప్రభుత్వం ఈ-టెండరింగ్‌ ద్వారా కోడిగుడ్ల్ల కొనుగోలులో పారదర్శక పద్ధతులను అమలుచేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో కమిషనరేట్‌, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కొనుగోళ్ల కమిటీ సంవత్సర కాల పరిమితితో టెండర్లు పిలుస్తున్నది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ధ్రువీకరణ పత్రంతో కోళ్లఫారాలు నిర్వహిస్తున్న రైతులు, నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (నాక్‌) పరిధిలో నమోదైన సంస్థలు మాత్రమే టెండర్‌ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు అనే నిబంధన విధించింది. కందిపప్పు లాంటి పప్పుదినుసుల సేకరణకు కూడా టెండర్‌ పద్ధతిని అనుసరిస్తున్నది.


★ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ తెలంగాణ పోర్టల్‌ ద్వారా పారదర్శక పద్ధతిలో ఆన్‌లైన్‌ ద్వారా పాలు, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, బాలామృతం, బాలామృతం ప్లస్‌ను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెలంగాణ ఆయిల్‌ ఫెడరేషన్‌ అండ్‌ ఫుడ్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్నది.


★ రాష్ట్రంలోని అన్ని (35,700) అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఈ-పాస్‌ విధానం ద్వారా గ్రామాల్లోని రేషన్‌ దుకాణాల నుంచి సేకరిస్తున్నది.


★ తెలంగాణ ప్రభుత్వం బాలామృతం, బాలామృతం ప్లస్‌ కింద అందజేసే పౌష్టికాహారం, మురుకుల ప్యాకెట్ల బరువును 2.5 కిలోల నుంచి 1.5 కిలోలుగా తగ్గించటం ద్వారా పరిశుభ్రతతో పాటు, చెడిపోకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకొన్నది.


★ మొబైల్‌ యాప్‌, వెబ్‌పోర్టల్‌ తదితర సాంకేతిక విధానాలను పాటిస్తూ తెలంగాణ సప్లయ్‌ చైన్‌ సిస్టమ్‌ను అద్భుతంగా అమలు చేస్తున్నది.


★ తెలంగాణలో రెడీ టు ఈట్‌ పద్ధతిలో సామ్‌ (తీవ్రమైన పోషకాహార లోపం), మామ్‌ (ఒక మోస్తరు పోషకాహార లోపం) పిల్లలకు అందించే ప్రోటీన్‌ స్నాక్స్‌, కోడిగుడ్ల పంపిణీ పథకం భేషుగ్గా అమలు అవుతున్నది.


★ అంగన్‌వాడీలకు పంపిణీ చేసే సరకులు పకదారి పట్టకుండా ఆధార్‌ అనుసంధానమైన ఐటీ ఆధారిత వ్యవస్థను ఉపయోగించటం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి.


★ రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే అంగన్‌వాడీ టీచర్‌, అంగన్‌వాడీ సహాయకుల అటెండెన్స్‌, సరుకుల స్వీకరణ సమయంలో బయోమెట్రిక్‌ విధానాన్ని అనుసరించటం వల్ల జబాబుదారీతనం పెరిగి దుబారాను తగ్గించేందుకు దోహద పడింది.


★ తెలంగాణ ఫుడ్స్‌ సంస్థ నుంచి తయారయ్యే పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్నది. దీనిని హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తరలించడం ద్వారా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల పరిపుష్టికి ఇతోధిక తోడ్పాటును అందించినట్టు అవుతున్నదని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది.

Share it:

TS

Post A Comment: