మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మద్దుకూరు పోదువివాదంలో ఐదుగురు ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు, స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ పరిధిలోని మద్దుకూరు వెస్ట్ బీట్ లో గల కాంపార్ట్మెంట్ నెం 95లో ప్లాంటేషన్ పనులకు రేంజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు శుక్రవారం వెళ్లగా, మద్దుకూరు శివారులోని అటవిప్రాంతంలో గల మంగలిగుట్టకు చెందిన చత్తీష్ ఘడ్ పోడుదారులు సుమారు 60 మంది ఒక్కసారిగా ప్లాంటేషన్ పనులను అడ్డుకున్నారు. ఈ భూములు మావి అంటూ ఫారెస్ట్ అధికారుల పై దాడికి పాల్పడ్డారు. దాడికి తట్టుకోలేక ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, రామారావు, బీట్ అధికారులు భాస్కర్, దేవ్ సింగ్, శ్రావణ్ లకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ వారిని రేంజర్ శ్రీనివాసరావు, ఏ ఎస్ఐ కోటేశ్వరరావులు వాహనాలలో చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై రేంజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... తరచూ ఫారెస్ట్ సిబ్బంది, అధికారులపై చత్తీష్ ఘడ్ కు చెందిన పోడుదారులు దాడులు చేస్తున్నారని, సిబ్బంది మాత్రం ప్రాణభయంతో విధులకు రాబోమని తెలిపారు. దాడి పై పోలీసులకు,అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోపక్క తమపైనే ఫారెస్ట్ అధికారులు దాడి చేశారంటూ పోడుదారులు ఆరోపిస్తున్నారు.
Post A Comment: