మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీపై వచ్చిన పామాయిల్ మొక్కలను పొలంలో ఆయన స్వయంగా నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 19 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయటమే అంతిమ లక్ష్యమన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేయడం వలన రైతులకు అధిక లాభాలు వస్తాయన్నారు. పామాయిల్ సాగు చేయడం వల్ల అంతర్ పంటలను సాగు చేయడం తో పాటు,అధికలాభాలు, అధికదిగుబడి వస్తాయన్నారు. గిరిజన రైతులతో పాటు గిరిజననేతర రైతులకు సైతం 90 శాతం సబ్సిడీతో పామాయిల్ మొక్కలను అందించడం జరుగుతుందన్నారు. పామాయిల్ తోట లో అంతర్ పంటలసాగు చేయటం వల్ల ఇతర పంటలను ప్రోత్సహించడంతో పాటు, పంట మార్పిడి విధానాన్ని అవలంభించినట్లు అవుతుందన్నారు. అనంతరం వివిధ సమస్యలపై కలెక్టర్ కు గ్రామస్తులు, వికలాంగులు, రైతులు వినతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖధికారి అభిమన్యుడు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, సర్పంచ్ ధరావత్ పార్వతి, ఉప సర్పంచ్ ధరావత్ రామారావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, తహసీల్దార్ వర్స రవికుమార్, ఏవో నవీన్ బాబు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: