జూలూరుపాడు జూన్ 24, మన్యం మనుగడ ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అధిక విస్తీర్ణం లో సాగు చేస్తున్న ప్రధానమైన పంట పత్తి, గత కొంత కాలంగా వర్షాభావ పరిస్థితులు, గులాబి రంగు పురుగుల ఉధృతి కారణంగా పత్తి దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి అధిక సాంద్రత పత్తి సాగు పై రైతులు అవగాహన పెంచుకోవాలని జూలూరుపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ రఘు దీపిక అన్నారు. ఈ సాగు విధానం ద్వారా మొక్కల సంఖ్యను పెంచడం, ఎదుగుదలను నియంత్రించడం, ఒకేసారి పంట చేతికందే విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రైతుకు ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశముందని తెలిపారు. అదేవిధంగా ఈ విత్తనం గులాబి రంగు పురుగు ఉదృతిని పూర్తిగా తట్టుకుంటుందని, ఈ వంగడాలు విత్తిన 150 రోజుల్లోనే పంట చేతికందుతుందని, తదుపరి వేరే పంట వేసుకునే వీలుందని అన్నారు. ఈ నూతన విధానం ద్వారా ఎకరాకు 10 నుండి 15 క్వింటాల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు. నూతన పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులకు ప్రభుత్వం విత్తన సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది మండల పరిధిలోని మాచినేని పేట క్లస్టర్ పరిధిలోని ఏడు గ్రామ పంచాయతీలలో సుమారు 50 ఎకరాలలో అధిక సాంద్రత పత్తి విత్తనాలు ప్రయోగాత్మకంగా సాగు చేపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ క్లస్టర్ పరిధిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నూతన వ్యవసాయ పద్ధతిలో అధిక సాంద్రత పత్తి విత్తనాలు నాటించడం జరిగిందని తెలిపారు.
Post A Comment: