హైదరాబాద్: గవర్నర్ తమిళిసై రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై ఇక్కడ తీసుకొస్తున్నారన్నారు. అది ప్రజాదర్బార్ కాదని, పొలిటకల్ దర్బార్ అని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థపై ప్రధాని మోదీ చెప్పేదొకటి చేసేదొకటని చెప్పారు. సీఎంగా ఉన్నప్పుడు ఒకలా, ప్రధాని అయిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్లుగా రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తులను నియమించాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ అన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బీజేపీకి చెందిన తమిళ్సైని రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం మోదీ చెప్పిన నియమానికి విరుద్ధమన్నారు. తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలన్నారు. గవర్నర్గా ఉండి రాజకీయాలు చేయడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బీజేపీ కుట్రలకు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీ మహిళా నేతలతో దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఏమైనా సత్యహరిశ్చంద్రులా.. ఎందుకు వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగడం లేదన్నారు. అదే విశయాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడుతున్నారని జీవన్రెడ్డి చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ.. ప్రధాని అయ్యారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్.. దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు.
Post A Comment: