మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సొంత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం తాటి వెంకటేశ్వర్లు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సొంత పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కోసం ఎంతో పాటుపడిన తనను కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన తనని టీఆర్ఎస్ పార్టీలోకి గౌరవంగా ఆహ్వానించిన వ్యక్తులు, ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు, తనను రాజకీయపరంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తనను పార్టీ కార్యకలాపాల్లో పక్కన పెడుతున్నారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామనే హామీతోనే వైసీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరానన్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదే ఏం జరగలేదని, పోడు భూములకు పట్టాల విషయంలో సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం లేదన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకంటే జూనియర్ అన్నారు. 1981 లోనే తాను సర్పంచ్గా గెలిచి ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ విధంగా చూసుకుంటే నేనే సీనియర్ అవుతానన్నారు. ఇటీవల ఖమ్మం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఇద్దరు ఖమ్మం లోనే ఉంటున్నారా అని ప్రశ్నించారు. కొత్త రాజ్యసభ సభ్యులు జిల్లాకు వచ్చే సందర్భంలో ఇచ్చిన మీడియా యాడ్స్, ఫ్లెక్సీలలో తన ఫోటోని వేయకుండా అవమానించారు. తన కూతురు చనిపోయిన 10 రోజులకు జిల్లా మంత్రి వచ్చి పరామర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్కు నేనంటే ఎంత ప్రేమో పరామర్శించిన తీరుని చూస్తే అర్థం అవుతుందన్నారు. ఇక పార్టీ రాష్ట్ర నాయకత్వం నుండి తనను పరామర్శించిన వారే లేరని బాధను వ్యక్తం చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ మాజీ ఎంపీ ఎమ్మెల్యే లను కలుపుకొని పోతేనే పార్టీకి మనుగడ అని చెప్పినప్పటికీ జిల్లా సీనియర్ నాయకులు కేటీఆర్ మాటలను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. 2018 ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామంలోనే టీఆర్ఎస్ కు ఓట్లు వేయించలేకపోయారని ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి తుమ్మలకు లేదంటూ సెటైర్లు వేశారు. తనకు జరుగుతున్న అవమానాల విషయంలో పార్టీ అధిష్టానం స్పందించకుంటే పార్టీ మారడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుండి పోటీలో ఉంటానని తాటి తెలిపారు.
Navigation
Post A Comment: