మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పాఠశాలలో ప్రతి తరగతిలో నూటికి నూరు శాతం విద్యార్థుల హాజరు శాతం ఉండాలని లేనిపక్షంలో ఉపాధ్యాయులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ లను పరిశీలించి, హాజరు శాతం తక్కువగా ఉండటం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి తరగతిలో ఈ నెలాఖరు కల్లా 90 శాతానికి పైగా హాజరు శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. తరగతి గదిలో, పాఠశాల ఆవరణలో, పాఠశాల సమయంలో సెల్ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్కడ నుండి ఎస్సీ బాలురు, ఎస్టీ బాలికల వసతిగృహాల వార్డెన్లతో ఫోన్లో మాట్లాడి, అసలు విద్యార్థులు ఎందుకు వసతి గృహానికి రాలేదే వివరణ ఇవ్వాలన్నారు. అవసరం అయితే జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని అసలు వార్డెన్లు ఎందుకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఇలా అయితే ఇబ్బందులు పడవలసి వస్తుందని తేల్చి చెప్పారు. పదో తరగతి విద్యార్థుల తో నేరుగా ఆయన మాట్లాడారు. ఈరోజు జరగాల్సిన ఫిజిక్స్ పాఠాలు జరిగాయని విద్యార్థులను అడగగా జరగలేదని చెప్పడంతో ఆయన విసుగు చెందారు. దీంతో ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తితే చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం స్థానిక పిఎస్ పాఠశాలలో అమలవుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమం పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ వారం లోపే విద్యార్థులకు దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు ఉప్పతల ఏడుకొండలు, ఉపాధ్యాయులు మంజుశ్రీ, సీత, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: