- రూ.300 కోట్ల రుణం ఇవ్వనున్న స్త్రీనిధి
- త్వరలో టీఎస్రెడ్కో-స్త్రీనిధి ఒప్పందం
మన్యం టీవీ వెబ్ న్యూస్:
తెలంగాణ లో ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి.గ్రామాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం 40 శాతం సబ్సిడీని ఇవ్వనున్నది. మొదటి దశలో ప్రతి జిల్లాలో వెయ్యి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. వీరికి అవసరమైన ఆర్థిక సాయాన్ని స్త్రీనిధి రుణం రూపంలో ఇస్తుంది. మూడు కిలోవాట్ల యూనిట్కు 40 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10 శాతం లబ్ధిదారుడు చెల్లించాలి. 50 శాతాన్ని స్త్రీనిధి రుణంగా అందిస్తుంది. ఈ రుణాన్ని ఐదు సంవత్సరాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. టీఎస్ రెడ్కో, స్త్రీనిధి సంస్థల మధ్య త్వరలో దీనిపై ఒప్పందం కుదరనున్నది. అనంతరం లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల ఏర్పాటు చేపడతారు.
*గ్యారంటీతో ఇబ్బందులు లేకుండా.*
సోలార్ ప్యానెల్స్కు 25 సంవత్సరాల పాటు గ్యారంటీ కల్పిస్తారు. అయితే వీటి ఫిజికల్ డ్యామేజీకి గ్యారంటీ లేదు. దీని కోసం సోలార్ ప్యానెల్స్ను ఇన్సూరెన్స్ చేయించాలని స్త్రీనిధి నిర్ణయించింది. ఇన్వర్టర్ తదితర పరికరాలకు ఐదు సంవత్సరాల గ్యారంటీ కల్పిస్తారు. లబ్ధిదారుల ఇంటికి యూనిట్ మొత్తం అమర్చి నెట్ మీటరింగ్ చేసేంత వరకు ప్రక్రియను ట్రాన్స్కో, టీఎస్ రెడ్కో, స్త్రీనిధి సంస్థలు సమన్వయం చేసుకుంటాయి. ఈ మూడు సంస్థలు వీటిని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి నోడల్ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు.
*అంకోలాలో విజయవంతం*
కామారెడ్డి జిల్లా అంకోలా క్యాంపు గ్రామంలో 24 యూనిట్లకు స్త్రీనిధి రుణం ఇచ్చింది. అక్కడ సోలార్ రూఫ్ టాప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో వీటిని ప్రోత్సహించాలని, రుణసౌకర్యం కల్పించాలని స్త్రీనిధి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. దాదాపుగా రూ.300 కోట్లకు పైగా రుణం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనిట్ వ్యయం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.ఈ వారంలో ధరలు ఖరారు అయ్యాక టీఎస్ రెడ్కో,స్త్రీనిధి సంస్థల మధ్య ఒప్పందం ఖరారవుతుంది.
*ఎంపిక విధానం*
లబ్ధిదారుల ఇండ్లు, కరెంటు మీటరు మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు, లేదా వాళ్ల కుటుంబ సభ్యుల పేరు మీద ఉండాలి. లబ్ధిదారులకు ఖచ్చితంగా ఆర్సీసీ బిల్డింగ్ ఉండాలి. ప్యానెల్స్ను భూమి మీద అమర్చడానికి వీలులేదు.స్లాబ్ కనీసం 160 నుంచి 200 చదరపు అడుగులకు పైగా ఉండాలి.నెలకు కనీసం 200-300 యూనిట్ల విద్యుత్ వాడుకొనే వారై ఉండాలి.గత సంవత్సర కాలంలో వారు వాడుకునే విద్యుత్ వినియోగం ఆధారంగా 2 లేదా మూడు కిలోవాట్ల యూనిట్ మంజూరు చేస్తారు.
Post A Comment: