హైదరాబాద్ : రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవల్ కమిటీ (ఎస్ఎల్సీ) చైర్మన్ రజత్కుమార్ నేతృత్వంలో జలసౌధలో సోమవారం భూగర్భ జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భూగర్భ జలశాఖ, కేంద్ర భూగర్భ జల మండలి సంయుక్తంగా రూపొందించిన భూగర్భ జలమట్టాల గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 10 మీటర్ల కంటే తక్కువ లోతులోనే నీరు లభిస్తున్నదని నివేదిక పేర్కొన్నది.
మొత్తంగా 83% మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయని, 93% గ్రామ పంచాయతీలు సేఫ్జోన్లోకి చేరినట్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల ఫలితంగానే భూగర్భజలాలు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. మిషన్కాకతీయ ద్వారా 26,700 చెరువుల్లో పూడికతీత, చెక్డ్యామ్ల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిరంతరాయంగా చెరువులను నింపడం ద్వారానే ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు విశ్లేషించారు. అనంతరం తెలంగాణ డిపార్ట్మెంటల్ వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీకి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని రజత్కుమార్కు భూగర్భజలశాఖ డైరెక్టర్ పండిత్ మద్నూరే అందజేశారు. సమావేశంలో సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: