మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 28 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు మన బడి" కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల పనుల పరిశీలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్య మరియు మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి శనివారం మండల పరిధిలోని పడమట నర్సాపురం కాలనీ ప్రాథమిక పాఠశాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మన ఊరు మన బడి" మొదటి విడతలో మండల వ్యాప్తంగా 17 పాఠశాలలు ఎంపిక కాగా, ఈ పాఠశాలల మేజర్ మరియు మైనర్ పనులకు గాను మొదటి విడతలో 1 కోటి 60 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. దీనిలో భాగంగా పడమట నర్సాపురం ప్రాథమిక పాఠశాలకు 5 లక్షల 12 వేల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సదుపాయాలను ఏర్పాటు చేసి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: