ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
మానవ సమాజంలో విలువల పెంపుదలే రంజాన్ ఉపవాసాల ప్రధాన ఉద్దేశ్యమని ప్రముఖ రచయిత యండి. ఉస్మాన్ ఖాన్ అన్నారు.ఏప్రిల్ నెల మూడవ తేదీనుండి రంజాన్ నెల ప్రారంభ మవుతున్న సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథపురంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనాడు మానవ జీవితాల్లో అశాంతి, అసంతృప్తి పెరిగిపోయిందని,శాంతి, సంతృప్తికోసం మానవుడు అనేక మార్గాలు అన్వేషిస్తున్నాడని,సరైన దారి దొరకక అంధకారంలో తచ్చాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. లేనిదానికోసం వెంపర్లాడకుండా ఉన్నంతలోనే సర్దుకుపోతే శాంతి ప్రాప్తమవుతుందని అభిప్రాయపడ్డారు.స్వార్ధం,అహం, అసూయ లాంటి దుర్లక్షణాలనువీడి, ప్రేమ, పరోపకారం, జాలి, దయ, కరుణ, సహనం, త్యాగం లాంటి సుగుణాలను అలవరచుకోవాలని సూచించారు. స్వార్ధం, అసూయలను త్యజిస్తే సగం సమస్యలు దూరమైనట్లేనని అన్నారు. రంజాన్ నెలలో సరైన రీతిలో విధులు నిర్వర్తిస్తే ఆశించిన ఫలితాలు తప్పకుండా లభిస్తాయన్నారు.కార్యక్రమంలో జబ్బార్, షబ్బిర్,యాఖూబ్ , మౌలానా, అబ్దుల్లా, సుభానీ, బషీర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: