న్యూఢిల్లీ/మన్యం వెబ్ డెస్క్:-దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గురువారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 90,928 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకూ అంతు లేకుండా పోయింది. 2,630 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. 2,85,401 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ పాజిటివిటీ భారీగా..
కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 6.43 శాతం. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆయా గణాంకాలేవీ అక్కడితో ఆగిపోతాయనే గ్యారంటీ లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య లక్షను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, కేరళ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు భారీగా రికార్డయ్యాయి. ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటేసింది. కర్ణాటకలో అయిదువేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు..
దీన్ని అడ్డుకోవడానికి దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలను అమలు చేస్తోన్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లను మళ్లీ ప్రవేశపెట్టాయి. ఈ చర్యలు మరింత విస్తృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకట్లా సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలను మరింత బలపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ నియంత్రణా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ వారం నుంచే వీకెండ్ లాక్డౌన్, వీకెండ్ కర్ఫ్యూను ప్రవేశపెట్టనున్నాయి.
ఎన్నికల రాష్ట్రాల్లో విస్తృత పర్యటన..
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వైరస్ స్థితిగతులపై దృష్టి సారించారు. ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాల్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారీ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తర ప్రదేశ్పై వరాలను కురిపించారు.
రంగంలో దిగిన మోడీ..
దేశంలో రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకు చేరువైన వేళ.. మోడీ రంగంలోకి దిగారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. వర్చువల్ రూపంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. దేశ రాజధానిలోని తన కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న కోవిడ్ స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యమంత్రుల నుంచి సలహాలు..
కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్రం అమలు చేస్తోన్న ప్రొటోకాల్స్.. ఇతర మార్గదర్శకాల గురించి మరోసారి ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీన్ని పునఃసమీక్షించడంతో పాటు కొత్త ప్రొటోకాల్స్ను ఎప్పటికప్పుడు జారీ చేయడానికి అవసరమైన సూచనలు, సలహాలను ముఖ్యమంత్రుల నుంచి స్వీకరించే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్.. ఇక సర్వసాధారణం కానున్నట్లు తెలుస్తోంది.
కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్..
ముఖ్యమంత్రులు.. తమ తమ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించేలా నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను ప్రధాని కల్పిస్తారని తెలుస్తోంది. దీనితోపాటు- వారంలో మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించడం, తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 10 గంటల వరకు దుకాణాలను తెరచుకోవడానికి అనుమతి ఇచ్చి.. అనంతరం మూసివేసేలా మార్గదర్శకాలను జారీ చేయొచ్చని తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన తరువాత కేంద్ర ప్రభుత్వం సరికొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను జారీ చేస్తుందని సమాచారం.
Post A Comment: