- విద్యార్థులకు అస్వస్థత ఉంటే వెంటనే పరీక్షలు జరిపించి, జాగ్రత్తలు తీసుకోవాలి.
- 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు సెలవుల్లోపు వ్యాక్సిన్ పూర్తి చేయాలి.
- రోజువారి లక్ష్యాలు పెట్టుకుని వ్యాక్సినేషన్ సంపూర్ణం చేయాలి.
- గిరిజన గురుకులాల అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్ కు వీడ్కోలు.
- రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
మన్యం మనుగడ వెబ్ డెస్క్
రాష్ట్రంలో ఒమిక్రాన్,కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన గురుకులాలు,ఆశ్రమ పాఠశాలలు,ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లలోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు,సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టి,కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ –శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.విద్యార్థులు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారిని వైద్యులకు చూపించి,తగిన పరీక్షలు చేయించాలని చెప్పారు.
మహబూబాబాద్,కురవి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో కోవిడ్ బారిన ముగ్గురు విద్యార్థులు పడడంతో వారికి సమగ్ర వైద్యం అందించాలని,ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 8వ తేదీలోపు 15 నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆయా గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు,సిబ్బంది బాధ్యత తీసుకుని ప్రతి విద్యార్థి టీకా వేయించుకునేలా చూడాలన్నారు.రోజువారి లక్ష్యాలు పెట్టుకుని విద్యార్థులకు ఈ టీకాలు వేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా విద్యార్థులు ఒమిక్రాన్,కోవిడ్ బారిన పడకుండా పరిర క్షించాలన్నారు.
గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఆయనకు వీడ్కోలు పలికి,శాలువాతో సన్మానించారు.
Post A Comment: