మన్యం మనుగడ న్యూస్: జూలూరుపాడు, నవంబర్ 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలివ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జూలూరుపాడు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి యేదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఆద్వర్యం లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టాలివ్వాలని కోరుతూ.. గురువారం రేంజర్ కార్యాలయం లో వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ.. 2014 జూన్ 2 వ తేదీని కటాఫ్ తేదిగా నిర్ణయించి ప్రతి ఒక్క గిరిజన, ఆదివాసీ, గిరిజనేతర పేద పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీశాఖ వారు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణ కు గురైన దరఖాస్తుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో అధికార బలం ఉన్న వారితో పోడుభూమి కమిటీలు ఏకపక్షంగా వేశారని, ఇలాంటి చోట్ల పక్షపాత వైఖరితో కొంతమందికి పోడు సాగు దారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. పోడు సాగు దారులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. పోడు సాగు దారులు అందరికీ న్యాయం జరిగే విధంగా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అడవి మధ్యలో పోడు వ్యవసాయం ఉండడానికి వీల్లేదని ప్రభుత్వ వాదనలో హేతుబద్ధత లేదని విమర్శించారు. పోడు వ్యవసాయం అడవిలో కాక ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వలస ఆదివాసీలకు హక్కు లేదనడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు సమాన హక్కులు వర్తిస్తాయని అన్నారు. మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు రైతులందరికీ పట్టాలు ఇప్పిస్తామని, రైతుల దగ్గర లంచాలు దండుకోనే మధ్య దళారీల ప్రమేయం అరికట్టాలని, దళారీల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు ప్రభుత్వం "రైతు బందు" మొదలగు పథకాలను అందజేయాలని గోపాలరావు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో పీ వై ఎల్ జిల్లా నాయకులు రాయల సిద్దు, ఏఐకెఎంఎస్ మండల నాయకులు మడి సీతరాములు, ఎర్రిపోతు రాజు, లాల్ సింగ్, చుక్కయ్య, కిషోర్, సునిల్, ఇరుమ, నంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: