మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డు లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంటకు చెందిన బేతి అంబేద్కర్ (26) అనే యువకుడు స్థానిక పేపర్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు తన చేయి క్రషర్లో పడి తెగిపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తెగిపడిన చేతిని ఐస్ బాక్స్ లో పెట్టి గాయపడిన వ్యక్తిని ఖమ్మం హాస్పిటల్ కు తరలించినట్లు తెలిసింది. పేపర్ బోర్డు లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, మరణాలు సంభవించడం, అవయవాలు దెబ్బతిని వికలాంగులుగా మారడం, తదితర పరిస్థితులను చూసి కార్మికులు భయాందోళనలు గురవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో అనేక ఆందోళనలు జరిగి అనేక మీడియా కథనాలు కూడా రావడంతో, పేపర్ బోర్డు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలను నివారిస్తారని, కార్మికులు ఊపిరి పీల్చుకొని రెండు నెలలు కూడా గడవకముందే మరొక ప్రమాదం చోటు చేసుకునే సరికి కార్మికులు భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కార్మిక శాఖ అధికారులు దృష్టిసారించి పేపర్ బోర్డ్ లో పాటిస్తున్న రక్షణ సూత్రాలు, ప్రమాదాలు జరుగుతున్న తీరు, ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా కార్మికులకు ఇస్తున్న తర్పీదు, కార్మికులు పనిచేసే పనిగంటలు తదితర వాటిపై విచారణ జరిపించి ప్రమాదాలు నివారించాలని కార్మికులు కోరుతున్నారు.
Post A Comment: