పెట్రోల్ పోసే యంత్రాల్లో మైక్రో చిప్లు అమర్చి 3 రాష్ట్రాల్లో వాహనదారులను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. పెట్రోల్ బంక్లలో పనిచేసే వారితో కలిసి ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకలో ఈ ముఠా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడింది. కొందరు వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అప్రమత్తమైన సైబరాబాద్ ఎస్వోటీ, మేడ్చల్, జీడిమెట్ల పోలీసులు నిఘా పెట్టి ఘరానా మోసగాళ్ల ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు నాలుగు పెట్రోల్ బంక్లలో పనిచేసే మేనేజర్లను కూడా అరెస్టు చేశారు.
బాలానగర్ డీసీపీ పద్మజ కేసు వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. ‘‘గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేసిన జగద్గిరిగుట్టకు చెందిన ఫైజల్ బారీ, సందీప్, అస్లం, నర్సింగ్రావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గతంలో బంకుల్లో పనిచేయడంతో వీరికి చిప్లు అమర్చి ఎలా మోసం చేయాలో అవగాహన ఉంది. దీంతో..జీడిమెట్ల, మైలార్దేవ్పల్లి, జవహర్నగర్, మేడిపల్లి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్నగర్, నెల్లూరు, సూర్యాపేట, సిద్దిపేట, తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడ్డారు. ఈ ముఠాతో పాటు పెట్రోల్ బంక్ల యజమానులు వంశీధర్రెడ్డి, రమేష్, మహేశ్వర్రావు, వెంకటేష్లను అరెస్టు చేశాం. వీరిపై ఆరు కేసులు నమోదు చేశాం. నిందితుల వద్ద నుంచి 6 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఎలక్ట్రానిక్ చిప్లు, మదర్బోర్డులు, పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నాం’’ అని డీసీపీ వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నట్టు వాహనదారులకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను, తూనికలు కొలతలశాఖ అధికారులను సంప్రదించాలని డీసీపీ పద్మజ తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
Post A Comment: