👉 రాష్ట్ర స్థాయి లో ఒకే ఒక్కడు..
👉 పలువురు జిల్లా అటవీ శాఖ అధికారుల ప్రశంసలు..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలో అదనపు రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు కీర్తి, ప్రతిష్టలతో కూడిన కెవిఎస్ బాబు ఐఎఫ్ఎస్ మెమోరియల్ గోల్డ్ మెడల్ లభించింది. హైదరాబాదులోని ధూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పిసిసిఎఫ్ శోభ, అడిషనల్ పిసిసిఎఫ్ డోబ్రియల్, అకాడమి డైరెక్టర్ రాజారావు చేతులు మీదుగా ఆయన పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. గత ఏడాది కాలంగా చండ్రుగొండ, జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలో అడవులను సమర్థవంతంగా కాపాడటం, అన్యాక్రాంతమైన 350 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని, ఆ ప్రాంతంలో ప్లాంటేషన్లను ఏర్పాటు చేయటం, వన్య ప్రాణుల అభివృద్ధి కోసం అడవుల్లో గడ్డి మైదానాల ఏర్పాటు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఇందుకు బాధ్యతాయుత విధులు నిర్వర్తించిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును అవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క అధికారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకోవడం పట్ల కన్సర్వేటర్ భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్, ఎఫ్డీవో అప్పయ్య ఆయనను అభినందించారు. జిల్లాలోని యువ అటవీ అధికారులు అవార్డు గ్రహీత ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందేందుకు విధులు నిర్వహించాలని వారు సూచించారు. పలువురు ఉన్నతాధికారులు శ్రీనివాసరావును ప్రశంసించారు.
Post A Comment: