👉జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
మన్యం టీవీ కొత్తగూడెం,ఆగస్టు 10:- అందరం ఒక టీము వర్కుగా పని చేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని, ఇందుకు ప్రతి ఒక్కరి సహాయ సహాకారాలు చాలా అవసరమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అదనపు కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రెవిన్యూ, అన్ని శాఖల జిల్లా అధికారులు సోమవారం కలెక్టరేట్ నందు అభినందన సభ నిర్వహించి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణా ఐఏఎస్ అధికారిగా, అదనపు కలెక్టర్గా జిల్లాపై సమగ్రమైన అవగాహన ఉందని, తదుపరి కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి దాదాపు 70 రోజులు పూర్తయ్యాయని, శిక్షణ ఐఏఎస్ నుండి కలెక్టర్ విధులు నిర్వహణ వరకు జిల్లా ప్రజలు, మీడియా, ప్రభుత్వ యంత్రాంగం సహాకారం ఎంతో ఉందని చెప్పారు. తెలంగాణ వాసిగా మన రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు వచ్చిందని, ఈ సదవాకాశంతో ఈ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించుటతోనే ఉద్యోగి జీవితం పరిపూర్ణమవుతుందని చెప్పారు. ప్రభుత్వం మన ముందుంచిన లక్ష్యాలు, ప్రణాళికలు ప్రకారం పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. విధుల పట్ల అంకితభావం, ప్రజలకు సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిగా కోరబడిన నివేదికలు సకాలంలో అందిస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పారు. జిల్లా అధికారుల అనుభవాలు తన పరిపాలనకు ఎంతో దోహదపడుతున్నాయని, ఇదే మున్ముందు అందించి జిల్లా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దరిచేర్చడంతో పాటు పరిపాలనకు అవసరమని చెప్పారు. కరోనా వ్యాధి వ్యాప్తి నుండి నేటి వరకు వైద్య సిబ్బంది సేవలు గమనిస్తున్నానని, వాగులు వంకలు దాటుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని అభినందించారు. మనం చేసిన సేవలు చిరకాలం ఉంటాయని చెప్పారు.
ఈ అభినందన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, డిర్డి ఓ మధుసూదన్రాజు, జడ్ఫీ సిఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: