చేతికి చేయూత - గుండెకు భరోసా
స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి శస్త్ర చికిత్సలు
మన్యం బిడ్డలకు సహాయపడుతున్న ఆదివాసి బిడ్డ
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన తోలెం శ్రీనివాస్, పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడిగా అందరికి సుపరిచితుడే. ఆయనలో గల మరో కోణం ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సహాయాన్ని అందించే వ్యక్తిత్వం. ఇటీవలనే అమరారం గ్రామానికి చెందిన కలేటి నిహాల్ గుండెకు సంబంధించిన వ్యాధితో 6 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న తోలెం శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కలేటి నీహాల్ గుండెకు శస్త్ర చికిత్స చేయించడం జరిగింది. శస్త్ర చికిత్స అనంతరం, ఇంటికి చేరుకున్న నిహాల్ తల్లిదండ్రులు సులోచన- కృష్ణ లు తోలెం శ్రీనివాస్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. అంతేకాక జానంపేట పంచాయతీ పిట్టతోగు ఆదివాసి ప్రాంతానికి చెందిన తాటి పాండు గత ఏడు సంవత్సరాల క్రితం మూర్చ వ్యాధి కారణంగా నిప్పు లో పడి శరీరం కాలిపోగా, ఎడమ చేయి, శరీరం కలిసి పోయినాయి. నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో, విషయం తెలుసుకున్న తోలెం శ్రీనివాస్, యధావిధిగా స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి, హైదరాబాదులో శస్త్ర చికిత్స చేయించి, చర్మానికి అంటుకొని ఉన్న చేతిని విడదీయడం జరిగింది. తమ కుమారుని పరిస్థితి తెలుసుకుని, శస్త్రచికిత్స చేయించిన తోలెం శ్రీనివాస్ కు, ఆపరేషన్ కు వెళ్లే సమయంలో ఆర్థిక సాయం చేసిన ఏడూళ్ల బయ్యారం సిఐ దోమల రమేష్, ఎస్సై టి వి ఆర్ సూరి లకు హృదయపూర్వక కృతజ్ఞతలను తాటి పాండు తల్లిదండ్రులైన తాటి సన్ను - సుజాత లు తెలియజేశారు.
Post A Comment: