మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీలో శనివారం జరిగిన "పల్లె ప్రగతి" 4వ విడత గ్రామ సభలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో పల్లె ప్రగతి పాదయాత్ర ద్వారా గ్రామంలో గుర్తించిన ప్రధాన సమస్యలు, 10 రోజుల ప్రణాళిక లో పరిష్కార నివేదికను గ్రామ కార్యదర్శి చదివి వినిపించారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు చదివి వినిపించారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న గ్రామస్తులు గ్రామంలో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, స్కూల్ పహరి, గ్రామంలో బీటీ రోడ్డు విస్తరణ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాములు నాయక్ ను గ్రామ సభలో కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ అతి తక్కువ కాలంలోనే అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి అవి అందరికీ అందిస్తూ అభివృద్ధిలో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందువరుసలో ఉందని అన్నారు. మనమంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండదండగా నిలిచి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాపకొల్లు గ్రామం నా స్వస్థలం అయినందున ఈ గ్రామం తో పాటు మండలాన్ని కూడా రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జెడ్పిటిసి కళావతి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ స్వాతి, మండల పార్టీ అధ్యక్షులు నర్సింహారావు, కాకర్ల ఎంపీటీసీ సతీష్ కుమార్, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: