మన్యం మనుగడ పినపాక:
పినపాక మండలం లోని
ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో సోమవారం ప్రారంభించబోయే ఐసోలేషన్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు శనివారం పరిశీలించారు. ఐసోలేషన్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సౌకర్యాల పైన అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీ సిబ్బంది, అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. శుభకార్యాలకు ప్రభుత్వం అనుమతించిన సభ్యులే కచ్చితంగా వెళ్లాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ కరోనా మహమ్మారి వ్యాపించకుండా సామాజిక దూరాన్ని పాటించాలి అని, మాస్కులు కచ్చితంగా ధరించాలని , అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, తహసీల్దార్ వెంకట విక్రమ్ కుమార్ ,పంచాయతీ కార్యదర్శి హజార్ తదితరులు ఉన్నారు
Post A Comment: