మన్యం మనుగడ డెస్క్:
తెలంగాణలో ఖాళీ అయిన హుజూరాబాద్ నియోజక వర్గం నుంచి త్వరలో జరగబోయే ఎన్నికల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేయాలని పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రజల స్వావలంబన కోసం ఉపయోగపడే కార్యక్రమాలు గాని, విధాన పరమైన నిర్ణయాలు గాని తీసుకోలేదని జై స్వరాజ్ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో అందరికీ ఉచితంగా ఇస్తామని చెప్పి, ప్రజలను మోసం చేసి ఆ రంగాలు ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయాలు ఉన్నాయని పార్టీ విమర్శించింది. కొరోనా వైరస్ తీవ్రతను కట్టడి చేసే చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో అనేక మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికి కూడా ప్రజలను ఆదుకునేందుకు స్పష్టమైన విధానాలు చేపట్టడం లేదు. ఇక నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఏడేళ్ల కాలంలో ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వరకు ప్రజా సంపదను లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారు. ఏ ఒక్క వర్గాన్ని పట్టించుకోని కేసీఆర్, హుజూరాబాద్ నియోజక వర్గానికి జరగనున్న ఎన్నిక నేపథ్యంలో దళిత సాధికారత అని కొత్త పల్లవి ఎన్నుకున్నారు. అసలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందే కేసిఆర్. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిందే ఆయన, దానిని నెరవేర్చలేదు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి దళితుల పట్ల మొసలి కన్నీరు కార్చడం సిగ్గుమాలిన చర్య. మొత్తం మీద తెలంగాణలో ప్రజలను అడుక్కునే పథకాలకు అలవాటు చేస్తున్నారు ముఖ్య మంత్రి. అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు విధానపరమైన పోరాటాలు వదిలి కేసీఆర్ ను వ్యక్తిగతం దూషిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకే సామాన్యుని ఆత్మ గౌరవ నినాదంతో పురుడుపోసుకున్న జై స్వరాజ్ పార్టీ హుజూరాబాద్ బరిలో నిలబడాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ నాయకుల ఏకాభిప్రాయం మేరకు పార్టీ నాయకులు కన్నం సురేష్ గంగపుత్రను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గుండగాని మధుసూదన్ గౌడ్,గుమిడెల్లి శ్రీనివాస్, కన్నం సురేష్, నగేష్ రాథోడ్, పరుశరాం గౌడ్, పీవీ రావు, డాక్టర్ హరిబాబు, బొమ్మగాని పరుశురాం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: