కరోనా బాధితులకు అండగా కంది సుబ్బారెడ్డి
తన పంచాయితీలో ప్రారంభించి మండల వ్యాప్తంగా సేవలు
మన్యం మనుగడ, పినపాక:
నేను బాగుంటే చాలు పక్కవాడు ఎలాగుంటే నాకేంటి అనుకునే ఈ రోజులలో, కరోనా బాధితులకు అండగా నిలుస్తూ, పినపాక మండలం లోని ప్రతి పంచాయతీలో గల కరోనా రోగులకు తనవంతుగా నిత్యావసరాలను అందిస్తున్న పినపాక మండలం వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి చేస్తున్న సేవ పై మన్యం మనుగడ అందిస్తున్న ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని
ఏడూళ్ల బయ్యారం పంచాయతీకి చెందిన కంది సుబ్బారెడ్డి మండలంలోని ప్రజలందరికీ సుపరిచితులే. సేవా పరంగానూ, రాజకీయపరంగా మండల వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. మండలంలోని సంగిరెడ్డి పల్లి పంచాయతీ నుండి ఎంపీటీసీగా గెలుపొంది పినపాక మండల వైస్ ఎంపీపీ పదవిని అలంకరించాడు. తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించి కొడుకులని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. మొదటి నుండి పరిచయం ఉన్న వారెవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే, స్వయంగా తానే వెళ్లి సహాయ సహకారాలు అందించే మనస్తత్వం. గడచిన సంవత్సర కాలం నుండి కరోనా ప్రభావం కారణంగా రోజువారీ కూలీలు పనులు లేక నానా అవస్థలు పడుతున్న విషయాన్ని గమనించి పలుమార్లు వారికి సహాయ సహకారాలు అందించిన గొప్ప వ్యక్తి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ప్రబలుతున్న సమయములో, కరోనా వైరస్ సోకిన చాలా మంది ఆక్సిజన్ ఎక్కించే స్థాయికి వెళ్లడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన కంది సుబ్బారెడ్డి విదేశాలలో ఉన్న తన కుమారుడికి మన వంతుగా కరోనా బాధితులకు ఏదైనా సహాయం చేద్దామని వివరించగా, దానికి తోడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సలహాతో ఇటీవలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం లో గల ప్రభుత్వ వైద్యశాలకు రెండు వెంటిలేటర్స్ ను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. అంతటితో సంతృప్తి చెందకుండా తన స్వగ్రామమైన ఏడూళ్ల బయ్యారం లో కరోనా రోగులకు నిత్యావసరాలను పంచే కార్యక్రమం ప్రారంభించాడు. ప్రతిరోజు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా నేరుగా కరోనా బాధితుల గృహాలకు వెళ్లి, కొన్ని రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించే కార్యక్రమం ప్రారంభించాడు. తన సేవలు తన స్వగ్రామానికి పరిమితం కాకూడదని భావించి, మండల వ్యాప్తంగా గల ప్రతి పంచాయితీలో నిత్యావసరాలను అందించే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ విధంగా ఇప్పటికే మండల వ్యాప్తంగా ఏడూళ్ల బయ్యారం, పోట్లపల్లి, సీతంపేట, బోటి గూడెం తదితర గ్రామాలలో కరోనా బాధితులకు నిత్యావసరాల రూపంలో తన సేవలను అందిస్తున్నాడు. ఈ విషయమై "మన్యం మనగడ" వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డిని పలకరించగా, మండల వ్యాప్తంగా ప్రతి పంచాయతీ లో గల కరోనా బాధితులకు దశలవారీగా నిత్యావసరాలను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశాడు
Post A Comment: