కొండా కొత్త ఉపాయం
ఎంత వర్షం పడినా తడిసే చాన్స్ లేదు , రైతుల కోసం కొండా విశ్వేశ్వరరెడ్డి సరికొత్త ఉపాయం , అకాల వర్షాల కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే తడిసి ముద్దవుతుండడంతో రైతుల కష్టం వర్ణాతీతంగా ఉంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయి అన్నదాతలకు భారీగా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రూ.500 ఖర్చుతో 100 క్వింటాళ్ల ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునే పద్ధతిని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆవిష్కరించారు. చేవెళ్లలోని గోదాముల వద్ద బుధవారం ఈ విధానాన్ని ఆయన రైతులకు దగ్గరుండి వివరించారు. ఈ క్రమంలో స్వయంగా ఆయనే ధాన్యం బస్తాలు మోశారు. మొత్తం ప్రక్రియను వీడియో తీయించి.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ‘‘ఒక టార్పాలిన్ కవర్ను కింద పరిచి దానిపై ధాన్యం బస్తాలను పిరమిడ్ ఆకారంలో పేర్చాలి. ధాన్యం బస్తాల చుట్టూ పరిచిన టార్పాలిన్ను పైకి మడిచి, బస్తాల చుట్టూ మార్కెట్లో దొరికే పల్చటి పొర లాంటి ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ వ్రాప్ లేదా స్కిన్ వ్రాప్)తో పూర్తిగా చుట్టేయాలి. ప్యాకింగ్ మెటీరియల్ అమ్మే షాపుల్లో ఇది దొరుకుతుంది. కేజీ రూ.120వరకు ధర ఉంటుంది. నాలుగు కిలోల వ్రాప్ 500 చదరపు అడుగులు వస్తుంది. ఇది 100 క్వింటాళ్ల ధాన్యం కాపాడుకునేందుకు సరిపోతుంది. ఇలా కిందివైపు టార్పాలిన్ వాడితే సుమారుగా రూ.2,500 మేర ఖర్చు వస్తుంది. ఒక వేళ టార్పాలిన్ లేకపోయినా గ్రానైట్ రాళ్లు లేదా ఇటుకల మీద ధాన్యం బస్తాలు వేసి ఈ ప్లాస్టిక్ కవర్ చుట్టినా సరిపోతుంది. ఇలా చేస్తే కేవలం రూ.500తోనే అంతా అయిపోతుంది. ధాన్యం రాశులను సైతం ఇదే పద్ధతిలో రెండు, మూడు నెలల పాటు కాపాడుకోవచ్చు’’ అని కొండా విశ్వేశ్వర్రెడ్డి వివరించారు.
Post A Comment: