నేడు లోటస్పాండ్లో వైఎస్ అభిమానులతో కీలక సమావేశం
నల్లగొండ నేతలతో తొలి భేటీ
త్వరలో చేవెళ్ళ నుండి పాదయాత్రకు నిర్ణయం
తెలంగాణలో మరోప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన షర్మిల
రాజన్నరాజ్యం, వైఎస్సార్ తెలంగాణ పేర్లు ప్రచారం
హైదరాబాద్, ఆంధ్రప్రభ:
తెలంగాణ పాలిటిక్స్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా, వైసిపి అధినేత జగన్ జైలులో ఉన్న సమయంలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించి తెలంగాణ ప్రజలకు షర్మిల చిరపరిచితులుగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహ దినోత్సవం ఫిబ్రవరి 9 కాగా, అదే రోజు షర్మిల తెలంగాణ ప్రాంతంలోని వైఎస్సార్ అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, హైదరాబాద్ లోటస్ పాండ్ కేంద్రంగా కీలకభేటీకి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయపార్టీ ఏర్పాటుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ సన్నిహితులకు, అభిమానులకు షర్మిల గత కొద్దిరోజులుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. మంగళవారం నిర్వహించే తొలి భేటీ.. వైఎస్ఆర్ తెలంగాణ ప్రాంత అభిమానుల భేటీగానే ఉంటుందా? రేపే పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తారా? కేవలం అభిప్రాయ సేకరణతోనే సరిపెడతారా? అన్న అంశాలపై మంగళవారం స్పష్టతరానుంది. మంగళవారం ఉదయం 10గంటలకు ఈ సమావేశం జరగనుండగా, అనంతరం వైఎస్ షర్మిల మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది.
గత కొద్దిరోజులుగా కీలకభేటీలు
వైఎస్ షర్మిల గత కొద్దిరోజులుగా.. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైసిపి అభిమానులతో కీలకభేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక హోటల్లో షర్మిల తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి కుటుంబసభ్యులు, ఒక ఎంపీ షర్మిలకు మద్దతుగా నిలుస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్లో, ఇటు టీఆర్ఎస్లో వైఎస్ఆర్కు సన్నిహితంగా మెలిగిన, వైఎస్తో మేలుపొందిన, వైఎస్ అంటే అభిమానం ఉన్న నేతలను సమీకరించడమే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ సంక్షేమం.. షర్మిలమ్మతోనే సాధ్యం
వైఎస్సార్ సంక్షేమం షర్మిలమ్మతోనే సాధ్యం, తెలంగాణ అభివృద్దికై ఆలోచించండి.. షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరచండి అన్న నినాదాలు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్నాయి. కష్టం తెలుసు.. కన్నీళ్ళు తెలుసు.. మన బతుకులు మార్చే దారి షర్మిలక్కకు తెలుసు అంటూ అభిమానులు అపుడే నినదిస్తున్నారు. రెడ్డి, క్రిస్టియన్, ఎస్సీలలో షర్మిల పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, తెలంగాణలోనూ రాజన్న రాజ్యం స్థాపించడం ఖాయమని షర్మిల సన్నిహిత వర్గాల అంచనాగా ఉంది. అన్నివర్గాలకు వైఎస్సార్ సంక్షేమపథకాలు చేరాయని, తెలంగాణలోని ప్రతి గుండెలో వైఎస్ఆర్ ఇంకా ఉన్నారని.. షర్మిలను రాజన్నబిడ్డగా అక్కున చేర్చుకుంటారని చెబుతున్నారు.
చేవెళ్ళ నుండి పాదయాత్ర
త్వరలో చేవెళ్ళనుండి మహా పాదయాత్ర నిర్వహించాలని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. గతంలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరోప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించిన షర్మిల.. తండ్రి బాటలో తెలంగాణ మొత్తం చుట్టేసే ప్రణాళికను తయారుచేసుకున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండగా, ఏఏ రాజకీయపార్టీల్లో ప్రకంపనలు రానున్నాయి.. అసలు ఈ పార్టీ ప్రభావం ఎంత అనేది రానున్నరోజుల్లో తెలుస్తుంది. కాగా షర్మిల పార్టీ ప్రకటన అనంతరం త్వరలో ఢిల్లిdలో పర్యటిస్తారని, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కూడా కలవబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
Post A Comment: