గతేడాది కంటే 2.32 మీటర్ల పెరుగుదల
మన్యం టీవీ, హైదరాబాద్ :
రాష్ట్రంలో భూగర్భజలాల మట్టం గత ఏడాది కంటే పెరిగింది. గతేడాది జనవరి నెలలో సగటున 8.88 మీటర్ల లోతులో భూగర్భ జలాల మట్టం ఉండగా ఈ జనవరి నాటికి 6.56 మీటర్లకు చేరింది.
మెదక్ జిల్లాలో సగటు గరిష్ట నీటిమట్టం 11.48 మీటర్ల లోతులో ఉండగా...వనపర్తి జిల్లాలో భూ ఉపరితలం నుంచి 2.69 మీటర్ల లోతులోనే భూగర్భజలాలున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని 971 పరిశీలక బావుల ద్వారా నీటిమట్టాలను పరిశీలించగా సగటున 2.32 మీటర్ల మేరకు నీళ్లు పైకి వచ్చాయి. జనవరి నెల వరకు రాష్ట్రంలో 1259.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం(852.2మి.మీ) కంటే ఇది 48 శాతం అధికం. కామారెడ్డి, సూర్యాపేట, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, కరీంనగర్, మేడ్చల్, నాగర్కర్నూల్, ములుగు, జనగాం, భద్రాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ రూరల్, మహబూబ్నగర్, సిద్ధిపేట, వరంగల్ అర్బన్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వనపర్తి జిల్లాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
సరాసరి నీటిమట్టం భూ ఉపరితలం నుంచి 6.56 మీటర్లుగా ఉంది. గతేడాది జనవరితో పోల్చి చూస్తే 2.3 మీటర్ల భూగర్భజల మట్టం పెరిగింది. ఏడు జిల్లాల్లో ఐదుమీటర్ల లోతులో, 23 జిల్లాలలో 5-10 మీటర్ల లోతులో, మూడు జిల్లాలో పది మీటర్ల దిగువ కంటే భూగర్భజలాలున్నాయి. 15 నుంచి 20 మీటర్లు, 20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భజలాలు 1 నుంచి 2 శాతం విస్తీర్ణంలో ఉన్నాయి.
దీని పరిధిలో ఎక్కువగా నిజామాబాద్ జిల్లాలోని తూర్పుప్రాంతం, సంగారెడ్డి, మెదక్, గద్వాల్ జిల్లాలోని పడమర, తూర్పు ప్రాంతాలు, సిద్దిపేట జిల్లాలో పడమర, దక్షిణ ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలు, కామారెడ్డి జిల్లా మధ్యపడమర, వికారాజిల్లాలోని ఉత్తర, బోపాలపల్లి జిల్లాలోని ఉత్తర, పడమర ప్రాంతాలలో అతిలోతైన ప్రాంతంలో భూగర్భజలాలు ఉన్నట్టు గమనించడమైంది.*
పదేండ్ల జనవరి మాసం సగటుతో చూసినట్టయితే 57 మండలాలలో భూగర్భజలాలు పడిపోయాయి. పదేండ్ల జనవరి నెల సరాసరితో పోల్చి చూస్తే రాష్ట్రంలోని 532 మండలాల్లో భూగర్భ జలాల మట్టాలు 0.5 మీటర్ల నుంచి రెండు మీటర్లకు పైగా పెరిగింది.
*జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి
గతేడాది జనవరితో పోల్చి చూస్తే రంగారెడ్డి జిల్లాలో 8.16 మీటర్లపైకి భూగర్భ జలం వచ్చి చేరింది. గతేడాది ఇదే సమయంలో ఆ జిల్లాలో సగటున 14.67 మీటర్ల లోతులో నీళ్లుండగా...ప్రస్తుతం 6.88 మీటర్ల లోతులో ఉన్నాయి. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 7.61 మీటర్లు, మెదక్ జిల్లాలో 6.86 మీటర్ల పైకి భూగర్బ జల మట్టం పెరిగింది. ములుగు జిల్లాలో కనిష్టంగా 0.09 మీటర్ల మేర భూగర్భ జలం పెరిగింది. ఆదిలాబాద్, భూపాలపల్లి జయశంకర్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో -0.51 నుంచి -0.03కి వరకు భూగర్భజలాల మట్టాలు తగ్గాయి.
Post A Comment: