రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలంటూ రాస్తారోకో...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆవరణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం పోడు భూమి సాగు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పోడు సాగు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు అభివృద్ధి పనుల పేరుతోటి ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనుల పోడు భూములను లాక్కోవాలని చూడడం దుర్మార్గమన్నారు. ఫారెస్ట్ అధికారులను అమాయక ఆదివాసీ గిరిజన రైతుల పైకి ఉసిగొలిపి అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో కొంతమంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం చూపించడం సరికాదన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు సాగు పై జీవనం గడుపుతున్న వారి పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగు రైతుల పక్షాన సిపిఎం పార్టీ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతు దీక్ష కు మద్దతుగా రైతు సంఘాల పిలుపుమేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి ప్రధాన కూడలిలో రాస్తారోకో చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పోడు సాగు రైతులందరికీ పట్టాలు ఇప్పించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పోడు భూముల పరిరక్షణ కమిటీ సభ్యులు భూక్య వీరభద్రం, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జాటోత్ కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు గూగులోత్ ధర్మ, మండల కార్యదర్శి చీమలపాటి బిక్షం, మండల నాయకులు భానోత్ ధర్మ, చింతల జగన్నాథం, కనకరత్నం, పద్మ, సుగుణ ,సరస్వతి, అమల, లక్ష్మి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: