హైదరాబాద్ : మెట్రో రైల్లో ఎల్బీనగర్ కామినేని దవాఖాన నుంచి జూబ్లీహిల్ అపోలో దవాఖానకు గుండె తరలింపు విజయవంతంగా పూర్తయ్యింది. గుండె తరలింపునకు తొలిసారి హైదరాబాద్లో మెట్రో సేవను వినియోగించారు. ఇందుకోసం నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు గ్రీన్ఛానెల్ను ఏర్పాటు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు 21 కిలోమీటర్ల దూరం ఉండగా.. నాన్స్టాప్ మెట్రో ఈ దూరాన్ని 30 నిమిషాల్లో చేరుకుంది. అనంతరం ప్రత్యేక అంబులెన్స్లో అన్ని జాగ్రత్తల నడుమ వైద్యులు గుండెను అపోలో దవాఖానకు చేర్చారు.
వైద్యులు, వైద్య సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ క్రతువు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. కాలంతో పరుగులు పెట్టిన ఈ ప్రయాణం ఎన్నో మనసుల్ని కదలించింది. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలో వరకు మెట్రో రైలు అధికారుల సహకారం తీసుకోగా.. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ అపోలో వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు అడుగడుగునా పోలీసులు సహకారం అందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్కు చెందిన వరకాంతం నర్సిరెడ్డి (45) ఆదివారం అధిక రక్తపోటుతో ఎల్బీనగర్ కామినేని దవాఖానలో చేరాడు. సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో మరొకరికి ఈ గుండెను అమర్చేందుకు జూబ్లీహిల్స్ అపోలో ప్రముఖ వైద్యుడు గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు.
Post A Comment: