👉నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి 👉జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలి,
మన్యం టీవీ కొత్తగూడెం ప్రతినిధి,
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగ యువతకు బ్యాంకు రుణాలు సకాలంలో ఇవ్వాలని , జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డి. అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్తాయి సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు వివిధ శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు వాటి అభివృద్ధి, రానున్న అభివృద్ధి పనుల ప్రణాళికల గురించి నివేదికలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆయా శాఖల అధికారులు విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేసి వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అందిస్తున్న అభివృద్ధి పథకాలను వారికి అందే విధంగా చూడాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు అందిస్తున్న రుణాలు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. రుణాల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి నిరుద్యోగులకు రుణాలు అందించి ప్రయోజకులను చేయాలన్నారు. రానున్న ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి పాఠశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాల్లో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు.. జిల్లాలో నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, రైతు కలలు, రైతు వేదికలు త్వరితగతిన పూర్తి చేసి వారికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.. డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్త వేరు చేసి కంపోస్టు ఎరువుగా వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలు జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించి ఆదర్శ గ్రామాలుగా తయారు చేయాలని కోరారు. వివిధ స్థాయిలో జరిగిన స్థాయి సంఘాల కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, జడ్పీటీసీలు, సీఈఓ విద్యా లత, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: