ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణం ఎల్బీనగర్ లోని ఆటోనగర్ ప్రాంతంలో రూపుదిద్దుకోనుంది. మొదటి దశలో 10 బస్ బేల నిర్మాణం చేపట్టి అనంతరం మరో 14 బస్ బేలను నిర్మించేందుకు నిర్ణయించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆధునిక హంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తొలుత రూ.18 కోట్లతో అంచనా వేసినా హరిణ వనస్థలిపురం వద్ద కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కావడంతో విస్తరణకు ఆటంకం ఏర్పడింది . దీంతో అంచనాలు తగ్గించి మొదటి దశ పనులకు రూ .9 కోట్లు హెచ్చిస్తున్నారు. ఈ బస్ టెర్మినల్ కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి బస్ టెర్మినల్ గా పేరుపెట్టనున్నారు.
ఎల్బీనగర్ మార్గం మీదుగా ఏపీతో పాటు తెలంగాణలోని ఖమ్మం , భద్రాచలం , నల్లగొండ , సూర్యాపేటకు నిత్యం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వీరికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్ బేలను నిర్మించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేయించారు. రోజువారీగా ఆర్టీసీ , ప్రైవేటు బస్సులు 500- 600 వరకు వెళ్తుంటాయి. రద్దీకనుగుణంగా బస్సు స్టాండ్లు లేకపోవడంతో ఇక్కడి చౌరస్తాలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు . ట్రాఫిక్ సమస్య సైతం వేధిస్తోంది . దీంతో ఇక్కడి బస్సు స్టాండను తొలగించి ఆటోనగర్ సమీపంలోని క్రీడా వద్ద ఏర్పాటు చేయనున్నారు.
ఏసీ బస్ బేల నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా . ఇందులో 10 బస్ బే లకు రూ 4.50 కోట్లు, మరో రూ 4.50 కోట్లు సోలార్ ప్లాంట్ , డ్రైనేజీ , ప్రయాణికుల వసతులకు ఖర్చు పెట్టనున్నారు. బస్ బే నిర్మాణంతో ఇక్కడి నుంచి ఒకేసారి వంద బస్సులు ఇలా వచ్చి అలా వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక మార్గం , సిటీ ప్రయాణికులకు మరో మార్గం ఉంటుంది. ఏసీ , నాన్ఏసీ నిరీక్షణ గదులు ఉంటాయి. నిరంతర విద్యుత్ కోసం 490కిలోవాట్స్ సౌరవిద్యుత్ ప్లాంట్ , నిరంతరం వైఫై సౌకర్యం, నీటిశుద్ధి కేంద్రం , పార్కింగ్ వసతులు,ఏటీఎం కేంద్రాలు , ఫుడ్ కోర్టులు , బుక్ షాపు, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానున్నాయి.
Post A Comment: