*జంపన్న వాగులో ప్రమాద నివారణ చర్యలు చేపట్టండి.
*త్రాగునీటికి ఎక్కడా లోటు ఉండొద్దు.
*టాయిలెట్స్ కు నిరంతర నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
*మినీ మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష చేసిన రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
మన్యంటీవీ తాడ్వాయి:
ఈరోజు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో
మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా అన్ని వసతులు కల్పించాలని, ఈ నెల రోజుల్లో అందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. అమ్మవార్ల దయ వల్ల జాతర తరవాత కరోనా వైరస్ వచ్చిందని, మళ్ళీ మినీ మేడారం వచ్చేటప్పటికి కరోనా కు వాక్సిన్ కూడా వచ్చినందున భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్నారు. మినీ మేడారం జాతర ఏర్పాట్ల కల్పనపై నేడు మేడారం ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో జిల్లా అధికారులతో సమీక్ష చేశారు.
మేడారంలో ప్రధానంగా వచ్చే భక్తులకు జంపన్న వాగులో స్నానం చేయాలన్న ఆచారం ఉన్నందున ఆ వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈసారి ఏ నష్టం జరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నారు.
చెక్ డ్యామ్ ల ఉపయోగం పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించాము అని చెప్పారు.
మొన్న ఇద్దరు పిల్లలు చనిపోవడం దురదృష్టకరం అన్నారు.
చెక్ డ్యామ్ లు తీసేయలన్నదే అందరి కోరిక అయితే తప్పకుండా తీసేస్తాము. ప్రాణాల కంటే వాటి కోసం పెట్టిన పైసలు ముఖ్యం కాదు అన్నారు. టాయ్లెట్స్ వద్ద నిరంతర నీటి సరఫరా ఉండాలన్నారు. ఇందుకోసం బోర్లు కావలసినన్ని ఉండాలన్నారు.
మిషన్ భగీరథ ద్వారా నీరు వస్తున్నందున ఎక్కడికక్కడ తాగునీటి వసతి ఉండాలన్నారు.
పారిశుధ్య పనులు నిర్వహించడానికి కావల్సినంత సిబ్బందిని నియమించుకోవాలన్నారు.
కరోనా వైరస్ నేపధ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అంబులెన్స్ లు, పరీక్ష కేంద్రాలు అన్ని సిద్దం చేసుకోవాలన్నారు.
ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ కు భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలన్నారు.
మేడారం వచ్చే భక్తుల వసతి కోసం తాత్కాలిక, శాశ్వత గదుల్లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు.
మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జాతరకు భక్తులు రానున్నందున ఆర్టీసి తరపున కావలసినన్ని బస్సులు పెట్టాలన్నారు.
భక్తులు చాలా మంది సొంత వాహనాలపై ఎక్కువ వస్తున్నందున రోడ్లు అన్ని మరమ్మత్తులు చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పి. ఓ హన్మంతు కే జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏఎస్పీ సాయి చైతన్య, ఆర్డీఓ రమాదేవి, జెడ్పీ సీఈవో ప్రసూన రాణి, డి.ఆర్. డి. ఓ పారిజాతం, మేడారం ఈ. ఓ రాజేందర్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Post A Comment: